Wednesday, April 6, 2011

చమురు ఉత్పత్తిలో ఒఎన్‌జిసి రాజమండ్రి అసెట్ కొత్త రికార్డు

రాజమండ్రి, ఏప్రిల్ 5: ఒఎన్‌జిసి రాజమండ్రి అసెట్ 2010-11 సంవత్సరానికి ముడి చమురు ఉత్పత్తిలో సరికొత్త రికార్డును సృష్టించింది. 0.282 మిలియన్ మెట్రిక్ టన్నులను ఉత్పత్తిచేయాలన్న లక్ష్యాన్ని నిర్ధేశించుకున్న రాజమండ్రి అసెట్ 0.30456మిలియన్ మెట్రిక్ టన్నులను ఉత్పత్తిచేసింది. 1987లో కెజి బేసిన్‌లో ఒఎన్‌జిసి చమురు ఉత్పత్తిని ప్రారంభించిన తరువాత ఇంత ఎక్కువ పరిమాణంలో ముడి చమురును ఉత్పత్తిచేయటం ఇదే తొలిసారి. గత ఆర్థిక సంవత్సరంలో 0.251మిలియన్ మెట్రిక్ టన్నులను ఉత్పత్తిచేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్న రాజమండ్రి అసెట్ 0.303 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉత్పత్తిచేసింది. అంటే గత ఆర్ధిక సంవత్సరంలో రోజుకు 840 టన్నుల ముడి చమురు ఉత్పత్తిచేసే పరిస్థితి నుండి ఈ ఏడాది 980 టన్నుల ఉత్పత్తికి చేరింది. గ్యాస్ ఉత్పత్తిలో కూడా రాజమండ్రి ఒఎన్‌జిసి అసెట్ లక్ష్యాన్ని అధిగమించింది.
గత నవంబర్‌లో గెయిల్ పైప్‌లైన్‌లో ఏర్పడ్డ అగ్నిప్రమాదం కారణంగా గ్యాస్ ఉత్పత్తికి కొంత అవరోధం ఏర్పడినప్పటికీ, ప్రత్యామ్నాయ పైపులైన్ ద్వారా తిరిగి ఉత్పత్తిని కొనసాగించింది. 1356 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తిచేయాలన్న లక్ష్యాన్ని నిర్ధేశించుకున్న రాజమండ్రి అసెట్, 2010-11లో లక్ష్యాన్ని అధిగమిస్తూ 1384.3 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తిచేసింది. తాటిపాక మిని రిఫైనరీ నుండి 66 మెట్రిక్ టన్నుల విలువ ఆధారిత ఉత్పత్తులను సాధించాలన్న లక్ష్యాన్ని, 67.78 మెట్రిక్ టన్నులతో సాధించింది. కృష్ణా జిల్లాలోని బంటుమిల్లి వద్ద ఉన్న మల్లేశ్వరంలోని ఎంఎస్‌ఏఏ బావి రోజుకు 35 టన్నుల ముడి చమురును ఉత్పత్తిచేయటం 2010-11 ఆర్థిక సంవత్సరంలో రాజమండ్రి ఒఎన్‌జిసి అసెట్ సాధించిన మరో విజయం. డ్రిల్లింగ్ కార్యకలాపాలు ముగించిన 10 రోజుల్లోనే ఈ బావి నుండి చమురును ఒఎన్‌జిసి ఉత్పత్తిచేస్తోంది.

No comments:

Post a Comment